SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్​లోకి రోబోలు

SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్​లోకి రోబోలు
  • కంట్రోల్​ రూం, మాస్టర్​ రోబో రెడీ
  • బుధవారం నుంచి రంగంలోకి..టన్నెల్​లో క్లిష్టంగా మారుతున్న పరిస్థితులు

ఎస్​ఎల్​బీసీ నుంచి వెలుగు టీం: ఎస్ఎల్​బీసీ టన్నెల్​లో ప్రమాదం జరిగి 18 రోజులు కావస్తుండగా, మంగళవారం అన్వి రోబోటిక్​ సంస్థ మాస్టర్​ రోబోతో రంగంలోకి దిగింది. సంస్థకు చెందిన నిపుణులు టన్నెల్​ ముందు కంట్రోల్​ రూం ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం రెస్క్యూ ఆపరేషన్​లో పాల్గొనే మూడు రోబోలను టన్నెల్​లోని 13.600 కిలోమీటర్ల దగ్గర దింపుతారు. రోబోలను మట్టి, రాళ్లు, బురద తీసే పనులకు వినియోగిస్తారు.

టన్నెల్​ బయట కంట్రోల్​ రూమ్​లో ఉండే మాస్టర్​ రోబో కమాండ్స్​తో మూడు రోబోలు అప్పగించిన పని చేస్తాయని సమాచారం. అన్వి రోబోటిక్​ సంస్థకు చెందిన విజయ్​ జగడం, అక్షయ్​ టన్నెల్​ లోపల రోబోల పనితీరును స్టేట్​ డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ అర్వింద్​ కుమార్​కు వివరించారు.

కలెక్టర్​ బదావత్​ సంతోష్, ఎస్పీ గైక్వాడ్​ రఘునాథ్, సింగరేణి జీఎం బైద్య, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్​​హోల్​ మైనర్స్, ర్వైల్వే ఇంజనీర్లతో ఉదయం రెస్క్యూ ఆపరేషన్​లో మ్యాన్​ పవర్, మెషీన్లు, రోబోలతో ఏ విధంగా పనిచేయించాలనే దానిపై చర్చించారు. టన్నెల్​ లోపల పని చేసే రోబోలకు ఆర్టిఫిషియల్  ఇంటలిజెన్స్​తో పని చేసే కెమెరాలను అమర్చుతారు. వీటి ద్వారా రోబోల పనితీరును గమనిస్తూ కంట్రోల్​ రూమ్​ నుంచి ఎప్పటికప్పుడు కమాండ్స్​ ఇవ్వనున్నారు..

క్లిష్టంగా పరిస్థితులు..

టన్నెల్​ లోపల 13.800 కిమీ దగ్గర స్లైడింగ్​ ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 12 ఏజెన్సీలకు చెందిన వందలాది మంది నిపుణులు మూడు షిప్టుల్లో రెస్క్యూలో పాల్గొంటున్నప్పటికీ.. అనుకున్న స్థాయిలో రిజల్ట్​ రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్​కు చెందిన డాక్టర్లు టన్నెల్​లో అందుబాటులో ఉంటున్నారు. సింగరేణి రెస్క్యూ టీమ్​ జీఎం బైద్య 19 గంటలు టన్నెల్​ లోపలే ఉండి మట్టి, రాళ్ల తరలింపుతో పాటు టీబీఎం కటింగ్, బురదలో కొట్టుకువచ్చిన మిషనరీ భాగాలను లోకో ట్రాక్​ ద్వారా బయటికి పంపిస్తున్నారు.

గనుల నిర్వహణ, ప్రమాదాలు జరిగిన సమయంలో వెంటనే స్పందించే సింగరేణి సంస్థ మైనింగ్​ ఎక్స్​పర్ట్స్​ సైతం టన్నెల్​ చివర్లో స్లైడింగ్​ ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. 9.2 వ్యాసార్థం ఉన్న టన్నెల్​లో 200 మీటర్ల వరకు కొట్టుకువచ్చిన వ్యర్థాలు, మట్టి, రాళ్లు, బురదను ఎస్కవేటర్ల ద్వారా కింది నుంచి తొలగిస్తుంటే పైనున్న మట్టి కిందికి జారుతోందని సమాచారం.

సోమవారం రాత్రి టన్నెల్​లో అర గంట కరెంట్ సప్లై నిలిచిపోవడంతో రెస్క్యూ బృందాలు తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు తెలిసింది. విపరీతంగా పెరిగిపోతున్న నీటి ఊట కారణంగా గట్టిపడిన మట్టి మళ్లీ వదులై బురదగా మారుతోందని చెబుతున్నారు. ఒక్క నిమిషం డీవాటరింగ్​ మోటార్లు నిలిచిపోతే 300 గ్యాలన్ల నీరు వరదలా పారుతోందని సమాచారం.